Pages

Wednesday, March 22, 2017

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. 1899 మార్చి 13న జన్మించిన ఇతను హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. పడకల్ లో మాతామహుల ఇంట జన్మించిన ఇతని స్వగ్రామం బూర్గుల. అసలు ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ స్వగ్రామాన్నే ఇంటిపేరుగా చేసుకొని ప్రసిద్ధి చెందారు. 1967 సెప్టెంబర్ 14న బూర్గుల మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం
బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చి 13న మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో జన్మించారు. ఇంటిపేరు పుల్లంరాజు. అయితే తన స్వగ్రామమైన బూర్గుల పేరుమీదుగా ప్రసిద్ధులై ఇదే ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. హైదరాబాదు లోని ధర్మవంత్ పాఠశాలలోను, నిజాం కాలేజీలోను ఆయన విద్యాభ్యాసం సాగింది. నిజాం కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో ప్రథముడిగా వచ్చి వాకర్ మెడల్ను గెలుచుకున్నారు. తరువాత పూనా (పుణె) ఫెర్గుసన్ కాలేజీలో బి.ఏ. చదివారు. అక్కడే మరాఠీ కూడా నేర్చుకున్నారు. తరువాత బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. చదివారు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు.

బూర్గుల రామకృష్ణారావు రాజకీయ జీవితం:-
న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసారు. కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసారు.హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అద్యక్షత వహించారు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించారు. 1948 లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటై వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడాయన షాద్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకోసం తన ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత బూర్గుల కేరళ రాష్ట్రానికి గవర్నరుగా పనిచేశారు. 1967 సెప్టెంబర్ 14న బూర్గుల మరణించారు.          

No comments:

Post a Comment

.