Pages

Wednesday, January 4, 2017

చమత్కార శ్లోకం

 చమత్కార శ్లోకం 


ఏకా భార్యా ప్రకృతి రచలా, చంచలాచ ద్వితీయా
పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః
శేషశ్శయ్యా ప్యుదధి  శయనం, వాహనం పన్నగారిః
స్మారం స్మారం స్వగృహ చరితం దారు భూతొ మురారి:

ఒకాయన ఉత్కళ దేశం లో వున్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి  ఉండడం చూసి ఆశ్చర్య పోయాడట. ఎందుకు? సామాన్యంగా అన్ని దేవాలయాల్లో విగ్రహాలు రాతితోగానీ లోహాలతో గానీ చేయబడి వుంటాయి. ఆ దారుమూర్తిని చూసిన ఆదికవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది. అదేమంటే శ్రీ మహా విష్ణువు తన కుటుంబం లోని వారి ప్రవర్తనలు చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట. విష్ణుమూర్తికి యిద్దరు భార్యలు ఒకావిడ ఒకరు కదలకుండా వుండే ప్రకృతి (భూదేవి)ఇంకొకావిడేమో ఒకచోట ఉండకుండా మనుష్యులను మారుస్తూ తిరుగుతూ వుంటుందిట. కొడుకు చూద్దామా అంటే ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ వుంటాడు.అందర్నీ బాధిస్తూ వుంటాడు. వాడేమైనా బలంగా వున్నాడా అంటే వాడికి శరీరమే లేదు. ఒక్క క్షణం విశ్రాంతి  తీసుకుందామా అంటే తాను నడుము వాల్చేది ఒక పెద్ద పాము మీద మెత్తగా వుంటుంది కానీ ఎంతసేపూ బుసలు కొడుతూ వుంటుంది.
ఒక తలా ఏమన్నా వెయ్యితలలాయే ఒకటి తర్వాత ఒకదానితో బుసలు కొడుతూంటాడు.
అది ఉండేది సముద్ర మధ్య లో అన్నీ అలలే హోరున శబ్దం ఒక అల అటువైపునుండి కొడితే ఇంకొకటి యిటువైపునుంచి కొడుతుంది. పోనీ వాహనమై ఎక్కి బయటికి పోదామా అంటే అది కూడా ఒక గ్రద్ద, పైన ఎగురుతూ పోతూవుంటే కింద పాము కనబడితే చాలు
తన యజమాని పని మర్చిపోయి గబుక్కున క్రిందికి దిగి ఆ పామును కాళ్లతో పట్టుకొని తినేదాకా కదలడు. ఇవన్నీ తలుచుకొని  తలుచుకొని విష్ణువు కొయ్యబారి పోయాడట.
కవుల మనసులో  ఏది మెరిస్తే అది చమత్కారంగా చెప్పేస్తారు.     

No comments:

Post a Comment

.